ఆజానుబాహుడు... అరివీరభయంకరుడు... రణరంగంలో ఎదురులేని ధీరుడు... దుర్గనిర్మాణధురంధరుడు... కళాపోషణలో సాటిలేని రసజ్ఞుడు... అతడొక చారిత్రక పురుషుడు..
1. సోమనాద్రి
(చారిత్రక వీరగాథ)
అనేక శతాబ్దాలకు పూర్వం రెడ్డి, వెలమ వీరులు తమ భుజబలంతో రాజ్యాలు సంపాదించుకున్నారు. ఆ స్వతంత్రరాజ్యాలు కొంత కాలానికి ఓరుగల్లు, విజయనగర సామ్రాజ్యాలకు వశమైపోయాయి. ఆ రాజుల పతనం తరువాత అవి నిజాం నవాబుకు సామంత సంస్థానాలుగా మారిపోయాయి. అటువంటి సంస్థానాల్లో ప్రసిద్ధి కెక్కింది గద్వాల సంస్థానం.
గద్వాల కోట ప్రవేశ ద్వారం (ప్రస్తుతం)
శతాబ్దాల చరిత్ర గల ఈ సంస్థానపు రాజులలో మొదటివాడు, ప్రసిద్ధి వహించినవాడు సోమనాద్రి. సోమనాద్రికి 'పెద్ద సోమభూపాలుడు' అనే ప్రసిద్ధ నామం కూడ ఉన్నది. ఇతడు క్రీ.శ. 1750 ప్రాంతంవాడు. బక్కమ్మ పెద్దారెడ్డిలు ఈయన తల్లిదండ్రులు. భార్య లింగమ్మ. గద్వాల కోటను నిర్మించింది ఇతడే. అనేక యుద్ధాలలో విజయాలను పొందినవాడు. దైవసహాయంచేత ఈయనకు గొప్ప నిధి దొరికింది. ఆ ధనంతో నగరాన్ని, దేవాలయాలను అభివృద్ధి చేసి, కంచి, శ్రీరంగం, తిరుపతి వంటి చోట్లనుంచి వచ్చిన అనేకమంది కళాకారులకు బహుమానాలను ఇచ్చిన కళాభిమాని. గద్వాల సంస్థానంలోని కాణాదం పెద్దన మొదలైన కవులు రామాయణాది గ్రంథాలు రచించారు. ఈవిధంగా గద్వాలసంస్థానం తెలుగు సాహిత్యాభివృద్ధికి చేయూతనిచ్చింది. సోమనాద్రి ఆరడుగుల ఎత్తుగల గంభీరవిగ్రహం, దృఢమైన నల్లనిశరీరం, సాముచేత కండలు తిరిగిన పొడవైన చేతులు కలిగినవాడు. మిత్రులకు గంభీరంగ, శత్రువులకు ప్రళయకాల రుద్రునివలె కనిపించేవాడు. అతడు తెల్లని గొప్ప జాతిగుర్రంమీద స్వారిచేస్తూ, యుద్ధరంగంలో కలయతిరుగుతూ అజేయుడై ఉండేవాడు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి